Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 25

' Story of Tataki -2 !'

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమమ్ |
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరమ్||

' అప్పుడు అప్రమేయుడైన ఆ మునియొక్క ఉత్తమమైన వచనములను వినిన పురుష శార్దూలమైన ఆ శ్రీరాముడు సముచిత రీతిలో ఇట్లు అడిగెన".

బాలకాండ
ఇరువది ఇదవసర్గము
( తాటక వృత్తాంతము)

అప్పుడు అప్రమేయుడైన ఆ ముని చేత తాటకి గురించి చెప్పబడిన ఉత్తమమైన వచనములను వినిన ఆ శ్రీరాముడు సముచిత రీతిలో విశ్వామిత్రుని ఇట్లు అడిగెను.

'ఓ మునిపుంగవా ! యక్షులు అల్పవీరులు అని వినబడడమైనది. అందువలన అబల అయిన ఆమె ఎట్లు వేయిఏనుగుల బలము కలిగియున్నది?' అని '

అమిత తేజోవంతుడగు ఆ రాఘవుడు చెప్పిన ఈ వచనములను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రువులను నాశనమొనర్చు రాఘవునితో ఇట్లు పలికెను.' రామా ! ఆ అబల అంత బలవంతురాలగుటకు కారణము వినుము. ఆమె వర ప్రభావమున వేయి ఏనుగుల బలము పొందినది. పూర్వము 'సుకేతు'డను ఒక మహాయక్షుడు ఉండెను. అతడు గొప్ప ప్రతిభావంతుడు, సత్ప్రవర్తన గలవాడు. సంతానములేనివాడు కనుక అతడు తీవ్రమైన తపస్సుని ఆచరించెను'.

'సుకేతుని తపస్సునకు సంతుష్టుడైన బ్రహ్మ వానికి ఒక కన్యారత్నము ప్రసాదించెను. ఆమె పేరు తాటకి. ఆ కన్యారత్నమునకు వేయి ఏనుగుల బలము ప్రసాదించెను. కాని ఆ సుకేతునకు పుత్త్రుని అనుగ్రహింపలేదు.'

'అట్లు జన్మించిన ఆ తాటకి పెరిగి పెద్దదై చక్కని రూపశోభలతో విలసిల్లెను. యశస్విని అగు ఆమెను జంభాసురుని పుత్రుడైన సుందునకు భార్యగా ఇచ్చెను. కొంతకాలము తరువాత ఆమె ఒక కుమారుని గనెను. అతని పేరు మారీచుడు. అతడు ఎదిరింప శక్యము గానివాడు. కాని శాపమువలన రాక్షసుడయ్యెను'.

'ఓ రామా! సుందుడు ఋషి సత్తముడగు అగస్త్యునివలన మృతిచెందెను. అప్పుడు ఆ తాటక పుత్త్రునితో కూడి అ మహామునిని చంపుటకు పూనుకొనెను. క్రుద్దురాలై ఆయనను భక్షించుటకు గర్జించుచూ ముందుకు ఉరికెను. అగస్త్యమహాముని మారీచునిని, " నీవు రాక్షసత్వము పొందువుగాక " అని శపించెను. పరమ క్రుద్ధుడైన ఆగస్త్యమహాముని తాటకిని కూడా శపించెను. "ఓ తాటకీ నీకు ఈ రూపము పోయి వికృతరూపముతో వికృత మైన ముఖముతో నరమాంస బక్షకురాలివి అగుము" అని'.

'అట్లు అగస్త్యుని శాపగ్రస్తురాలైన తాటకి, అ శాపమునకు తట్టుకొనలేక క్రోధముతో జలించెను. ఆ కారణముగా ఆగస్త్యుడు తిరిగిన ఈ ప్రదేశమును అంతయూ ధ్వంసమొనర్చుచున్నది. కనుక ఓ రాఘవా! దుష్ప్రవర్తన గలదియూ, మిక్కిలి భయంకరమైనదియూ, దుష్టమైన పరాక్రమము గలదియూ అయిన తాటకిని గో బ్రాహ్మణ హితము కొఱకు వధింపుము. ఓ రఘునందనా శాపమునకు గురి అయిన తాటకిని వధించుటకు నీవు తప్ప ముల్లోకములలో ఇంకెవరునూ సమర్థులుగారు'.

' ఓ నరోత్తమా ! స్త్రీని చంపుట ఎట్లు అని ఆమెపై కనికరము చూపవద్దు. నాలుగు వర్ణములవారికి మేలు కూర్చుట రాజకుమారుని కర్తవ్యము. ప్రజలహితము కొఱకు చేయు కార్యము అది కౄరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు. పాతకమైననూ దోషములతో కూడినదైననూ దానిని అవశ్యముగా ఆచరింపవలసినదే. రాజ్యభారము మోయువారికి ఇది విద్యుక్త ధర్మము. కనుక ఓ కకుత్స్థా ! అధర్మమునకు ఒడి గట్టిన ఈ తాటకిని వధింపుము. ఈమె చేయు పనులలో 'ధర్మము' అన్న మాటకు స్థానము లేదు'.

'ఓ రామా! పూర్వము విరోచనుని సుత అయిన మంథర అను నామె భూదేవిని చంపుటకు పూనగా, అప్పుడు ఇంద్రుడు ఆమెను చంపెనని వింటిమి. పూర్వము భృగుపత్నియూ శుక్రాచార్యుని తల్లియూ ఇన ఆమె ఇంద్రాది దేవతలను సంహరించుటకు ధృడవ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపెను'.

'ఓ రాజకుమారా ! ఈ విధముగా చాలామంది మహానుభావులు అధర్మములకు ఒడి గట్టిన స్త్రీలను వధించిరి . కావున ఓ రామా! కనికరము చూపక నామాటను పాలించి దుర్మార్గురాలైన తాటకిని వధింపుము.' అని.

ఈవిథముగా బాలకాండలోని ఇరువది ఇదవసర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్ ||

ఏతైశ్చాన్యైశ్చ బహుభిః రాజపుత్త్ర మహాత్మభిః |
అధర్మసహితా నారో హతాః పురుషసత్తమైః |
తస్మాదేవానాం ఘృణాం త్యక్తా జహి మచ్ఛాసనానృప||

'ఓ రాజకుమారా ! ఈ విధముగా చాలామంది మహానుభావులు అధర్మములకు ఒడి గట్టిన స్త్రీలను వధించిరి . కావున ఓ రామా! కనికరము చూపక నామాటను పాలించి దుర్మార్గురాలైన తాటకిని వధింపుము.' అని.

||ఓమ్ తత్ సత్||


|| om tat sat ||